కంపుకొడుతున్న పెద్దాసుపత్రి
ABN , First Publish Date - 2022-08-18T05:05:54+05:30 IST
కంపుకొడుతున్న పెద్దాసుపత్రి
సంగారెడ్డి జీజీహెచ్లో కొరవడిన పారిశుధ్యం
చెత్తబుట్టల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
దుర్వాసన వెదజలుతున్న మరుగుదొడ్లు
ప్రమాదకరంగా బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణ
సంగారెడ్డిఅర్బన్, ఆగస్టు 17 : సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నది. ఎటుచూసినా చెత్తాచెదారం, చెత్తబుట్టల్లో పేరుకుపోయి వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణ ప్రమాదకరంగా ఉన్నది. సర్కారు దవాఖాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కాయకల్ప కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. చిన్న సూది కూడా ఆస్పత్రి ఆవరణలో కనిపించ కూడదనేది కాయకల్ప ముఖ్య ఉద్దేశం. ఆ దిశగా జిల్లాలో పలు ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడుతున్నాయి. కానీ సంగారెడ్డి జీజీహెచ్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఆస్పత్రిలో 150 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా వార్డుల్లో, ఆవరణలో చెత్తా, చెదారాన్ని, బయోమెడికల్ వ్యర్థాలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. కానీ పర్యవేక్షణ లోపంతో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసినట్టు కనిపించడం లేదు. ఫలితంగా ఆస్పత్రి కంపు కొడుతున్నదని రోగులు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.