వర్షం వస్తే ఆగమే!

ABN , First Publish Date - 2022-04-24T05:30:00+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకునే దశలో కమ్ముకొస్తున్న మబ్బులు.. రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షసూచనకు తోడుగా రెండు రోజులుగా వాతావరణంలో ఆకస్మికంగా చోటుచేసుకుంటున్న మార్పులు ఆందోళనకు కారణమయ్యాయి.

వర్షం వస్తే ఆగమే!
మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌లో ఆరబోసిన ధాన్యం

మెదక్‌అర్బన్‌, ఏప్రిల్‌24: ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకునే దశలో కమ్ముకొస్తున్న మబ్బులు.. రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షసూచనకు తోడుగా రెండు రోజులుగా వాతావరణంలో ఆకస్మికంగా చోటుచేసుకుంటున్న మార్పులు ఆందోళనకు కారణమయ్యాయి. పుట్ల కొద్ది ధాన్యం ఐకేపీ కేంద్రాలకు చేరుకుంటున్నది. మెదక్‌ జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో వరుణుడు కన్నెర చేస్తే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నది.


కమ్ముకొస్తున్న మబ్బులు

మెదక జిల్లా వ్యాప్తంగా భానుడు  భగభగమండిపోతున్నాడు. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి తాళలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  అయితే గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటలకు వరకు విపరీపతమైన ఎండ ఉంటుంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్మేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావారణ శాఖ అధికారులు మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న ప్రకటనతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 


ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతన్నలు నానా అగ చాట్లు పడుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా హవేళీఘణపూర్‌ మినహా ఇంకా ఎక్కడా కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పు లు చోటుచేసుకుంటున్నాయి. అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్ధితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ధాన్యం విక్రయించే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. 


గుండెల్లో గుబులు

మెదక్‌ జిల్లాలో చాలా మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కోసిన ధాన్యం కోసినట్లుగా మిల్లులకు చేరుతుంది. మరికొంత ధాన్యం ఐకేపీ కేంద్రాలకు పోటెత్తుతుంది. సన్నాలను మార్కెట్‌, మిల్లులకు, దొడ్డురకం ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలు కాలేదు. కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేవు. ఇక తాగునీరు, టెంట్లు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అకాల వర్షాలు కానీ కురిస్తే ధాన్యం రాశులు తడవడంతో పాటు కోతకు  సిద్ధంగా ఉన్న పొలాలు పాడవుతాయనే గుబులు రైతుల్లో మొదలైంది. 


టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి 

- సాయిలు, రైతు జంగరాయి

గతంలో ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు అందించినా చాలా మంది రైతులు ఆర్ధిక స్థోమత లేని కారణంగా కొనుగోలు చేయలేదు. ఐకేపీ సెంటర్లలో టార్పాలిన్లను ప్రభుత్వమే అందుబాటులో ఉంచాలి.

Updated Date - 2022-04-24T05:30:00+05:30 IST