పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-07-06T05:25:32+05:30 IST
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
మండల సభలో ప్రజాప్రతినిధుల డిమాండ్
కొల్చారం, జూలై 5: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీపీ మంజుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యులు తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మొదటగా మండలంలో పలు ప్రమాదాల్లో మృతి చెందిన విద్యార్థులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎంఈవో నీలకంఠం మాట్లాడుతూ.. పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎంపీడీవో తన ఛాంబర్లో చెత్తను వేస్తున్నారని జడ్పీటీసీ మేఘమాల ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం పట్ల మండిపడ్డారు. సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో ప్రవీణ్, సర్పంచులు వీరారెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, ఎంపీటీసీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.