Sharmila: పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమే..

ABN , First Publish Date - 2022-09-25T18:37:45+05:30 IST

తెలంగాణలో ప్రజలను కేసీఆర్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని షర్మిల విమర్శించారు.

Sharmila: పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమే..

సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.): సీఎం కేసీఆర్ (CM KCR) మోసగాడని, ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో దిట్టని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) విమర్శించారు. తెలంగాణలో ప్రజలను కేసీఆర్‌తోపాటు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు కూడా మోసం చేశాయని మండిపడ్డారు. షర్మిల పాదయాత్ర వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు చేరింది. సదాశివపేట పట్టణంలో ప్రజలతో మాట.. ముచ్చట కార్యక్రమంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంక్షేమ పాలన తమ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు.


పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమేనని, ఎవరు ప్రశ్నించకూడదని, ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉందని షర్మిల విమర్శించారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. 8 ఏళ్లుగా అంతా గారడీ మాటలే చెప్తున్నారని, ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు. కేసీఅర్ అవినీతిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఏనాడు ప్రశ్నించలేదన్నారు. వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, వైఎస్సార్ సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్న ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలని షర్మిల పిలుపిచ్చారు. 

Updated Date - 2022-09-25T18:37:45+05:30 IST