ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి
ABN , First Publish Date - 2022-05-30T05:30:00+05:30 IST
బాలలు సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్, మే 30 : బాలలు సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షులను కోల్పోయిన పిల్లలకు కలిగిన నష్టం పూడ్చలేనిదని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు అండగా నిలవాలనే సంకల్పంతోనే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను తీసుకువచ్చామని చెప్పారు. ఈ పథకం ద్వారా బాలలకు సమగ్ర సంరక్షణ, భద్రత, భోజన, నివాస సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులైన బాలలకు 23 ఏళ్లు వచ్చే వరకు రూ. 10 లక్షల విలువైన ప్రయోజనం సమకూరుతుందన్నారు. ఒకటి నుంచి 12 తరగతుల వరకు పిల్లలకు ఏడాదికి రూ. 20వేలు స్కాలర్షిప్, ప్రతీ నెల రూ. 4వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని తెలియజేశారు. 18 నుంచి 23 ఏళ్ల వరకు సాంకేతిక విద్యకు స్వనత్ స్కాలర్షిప్, రూ.50 వేల స్టైఫండ్ చెల్లిస్తామని వెల్లడించారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 లోపు కరోనా కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన బాలలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం మెదక్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలకు, సంగారెడ్డి జిల్లాలో అర్హులైన తొమ్మిది మంది బాలలకు ఆయా జిల్లాల అధికారులు పీఎం కేర్స్ పథకం బాండ్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్కార్డు, స్నేహపాత్ర సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి జిల్లా సంక్షేమాధికారి జయరాంనాయక్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, వివిధ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు, సంగారెడ్డి జిల్లా నుంచి అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీసీపీవో రత్నం, సీడబ్ల్యూసీ మెంబర్లు వెంకటేశం, వేరోనికా, విష్ణుమూర్తి పాల్గొన్నారు.