అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-20T04:30:11+05:30 IST
కుటుంబం గడవడం కోసం చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది.
నంగునూరు, సెప్టెంబరు 19: కుటుంబం గడవడం కోసం చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది. రాజగోపాల్పేట ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రేపాక నారాయణరెడ్డి(58) తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడి పెళ్లి కోసం నాలుగున్నర లక్షల అప్పు చేశాడు. గ్రామంలో అప్పటికే ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మినా అప్పులు తీరలేదు. రోజురోజుకు అప్పులు అధికమవడంతో బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అయితే చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పాలమాకుల గ్రామ శివారులోని చామంతుల యాదగిరి చింతచెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.