అధికారులు పనితీరు మార్చుకోవాలి: ఎంపీపీ
ABN , First Publish Date - 2022-12-10T00:01:09+05:30 IST
మండలంలోని ఆయా శాఖల అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ సూచించారు.
పెద్దశంకరంపేట, డిసెంబరు 9: మండలంలోని ఆయా శాఖల అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశానికి సమయానికి కేవలం ఇద్దరు అధికారులు మాత్రమే రావడం.. మిగిలిన శాఖల అధికారులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు ఇలాగే కొనసాగితే మండల సర్వసభ్య సమావేశాన్ని రద్దు చేసి, జిల్లా అధికారులకు నివేదికలు అందిస్తామని హెచ్చరించారు. తమ గ్రామ రైతు నెలనెల కరెంట్ బిల్లు చెల్లించినప్పటికీ రూ.50 వేల కరెంట్ బిల్లు ఎలా వస్తుందని గొట్టిముక్కుల ఎంపీటీసీ దత్తు ప్రశ్నించారు. దీంతో విద్యుత్ అధికారులతో ఎంపీపీ ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలకు ఆయా శాఖల అధికారులు పరిష్కారం చూపడం లేదని, తప్పనిసరిగా ప్రజాప్రతినిధులకు అధికారులు జవాబు చెప్పాలని ఎంపీపీ సూచించారు. ఉపాధి హామీ పథకంలో రెండు నెలలుగా కూలీలకు డబ్బులు పడడం లేదని సభ్యులు అన్నారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సభలో చదివి వినిపించారు. మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని ఎంపీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ లక్ష్మిరమేష్, ఎంపీడీవో రఫీక్ఉన్నిసా, ఎంపీటీసీలు దత్తు, దామోదర్, వీణసుభా్షగౌడ్, స్వప్నరాజేశ్వర్, రాజునాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, సర్పంచులు అంజిరెడ్డి, నరేష్, లక్ష్మణ్నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.