అంగన్‌వాడీ కేంద్రానికి పక్కాభవనం కరువు

ABN , First Publish Date - 2022-12-10T00:03:18+05:30 IST

మండలంలోని అల్లీపూర్‌ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలో అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం లేక శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో కొనసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది.

అంగన్‌వాడీ కేంద్రానికి పక్కాభవనం కరువు
శిథిల భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

శివ్వంపేట, డిసెంబరు 9: మండలంలోని అల్లీపూర్‌ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలో అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం లేక శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో కొనసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. అల్లీపూర్‌ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో 22మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఇక్కడ మినీ అంగన్‌వాడీ కేంద్రం మంజూరైనప్పటి నుంచి కూడా సొంతభవనం లేక స్థానిక పాఠశాల ఆవరణలోనే కేంద్రాన్ని నిర్వహించారు. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాన్ని నిర్మించి అందులోకి పాఠశాలను మార్చారు. అయితే అంగన్‌వాడీ కేంద్రం మాత్రం శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలోనే కొనసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీకి పంపినప్పటికీ పాత భవనం ఎప్పుడు కూలుతుందోననే భయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రానికి పక్కాభవనం మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-10T00:03:19+05:30 IST