చిట్టీల పేరుతో రూ.కోటికి కుచ్చు టోపి
ABN , First Publish Date - 2022-09-10T05:50:54+05:30 IST
ఓ గృహిణి రాత్రికి రాత్రి రూ.కోటి చిట్టీల డబ్బుతో ఉడాయించిన ఉదంతం పటాన్చెరు పోలీ్సస్టేషన్ పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో చోటు చేసుకుంది.
పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు
పటాన్చెరు, సెప్టెంబరు 9: ఓ గృహిణి రాత్రికి రాత్రి రూ.కోటి చిట్టీల డబ్బుతో ఉడాయించిన ఉదంతం పటాన్చెరు పోలీ్సస్టేషన్ పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో చోటు చేసుకుంది. చిట్టీలు వేసిన బాధితులు శుక్రవారం పటాన్చెరు పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిప్రియ కాలనీలో నివాసం ఉండే ఉమాదేవి కొంతకాలంగా చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా ఉంటూ చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల, రోజు వారి కూలీలు ఉమాదేవిపై నమ్మకంతో చిట్టీలు వేశారు. సుమారు రూ. కోటి నగదు వసూలు చేసిన ఉమాదేవి కొంత కాలంగా చిట్టీలు పూర్తైనా డబ్బులు చెల్లించకుండా తిప్పుకున్నారు. ముందస్తు ప్రణాళికతో కాలనీలోని సొంత ఇంటిని గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయించారు. బాధితులు డబ్బు కోసం ఇంటికి రాగా తాళం వేసి ఉండడం, ఉమాదేవి సెల్ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో పరారైనట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా ఉమాదేవికి స్థానిక ప్రజాప్రతినిధులు, కొందరు పెద్దమనుషులు అండ ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.