హైవే పనులను వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-11-07T23:53:16+05:30 IST

మెదక్‌, సిద్దిపేట నేషనల్‌ హైవే పనులను వెంటనే ప్రారంభించాలని ఆయా జిల్లాల ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

 హైవే పనులను వెంటనే ప్రారంభించాలి
హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

మెదక్‌, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు భూసేకరణ వేగవంతం చేయాలి

ఆర్‌అండ్‌బీ అధికారుల సమీక్షలో

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

నేషనల్‌ హైవే పనులపై ఆరా

సిద్దిపేట టౌన్‌, నవంబరు 7: మెదక్‌, సిద్దిపేట నేషనల్‌ హైవే పనులను వెంటనే ప్రారంభించాలని ఆయా జిల్లాల ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రీచ్‌1 నేషనల్‌ హైవే సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్‌ 2 నేషనల్‌ హైవే మెదక్‌ జిల్లాలో మెదక్‌ టౌన్‌ నుంచి నిజాంపేట వరకు నిర్మాణం సాగనున్నట్లు తెలిపారు. మెదక్‌ నుంచి సిద్దిపేట వరకు రూ. 882.18 కోట్లతో 69.97 కిలోమీటర్ల వరకు ఫోర్‌లేన్‌ మెదక్‌ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్దిపేటలో 36.302 కిలోమీటర్లలో ఫోర్‌ లేన్ల రోడ్డు రానున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట, అక్బర్‌పేట, చిట్టాపూర్‌, హబ్సీపూర్‌, ధర్మారం, తిమ్మాపూర్‌, ఇర్కోడు, బూరుగుపల్లితో పాటు సిద్దిపేట పట్టణ పరిధిలో నాలుగు వరుసల రోడ్లు రానున్నట్లు వివరించారు. మెదక్‌ జిల్లాలో మెదక్‌టౌన్‌, పాతూర్‌, అక్కన్నపేట, రామాయంపేట్‌, కోనాపూర్‌, నందిగామ, నిజాంపేట గ్రామాల్లో నాలుగు వరుసల రోడ్లు రావడం వల్ల ఈ గ్రామాల రూపురేఖలు మారనున్నట్లు చెప్పారు. నేషనల్‌ హైవే రోడ్డు సాగే గ్రామాల వెంట 4 లైన్‌ రోడ్‌, స్ట్రీట్‌ లైట్స్‌ ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్‌, ఇరువైపులా వర్షపు నీరు నిలువకుండా సైడ్‌ డ్రైన్లు, ఫుట్‌ పాత్‌లు నిర్మించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట టౌన్‌లో ఎన్‌సాన్‌పల్లి జంక్షన్‌ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్‌సాన్‌పల్లి సర్కిల్‌ వద్ద వెహికల్‌ అండర్‌ పాస్‌, సిద్దిపేటలో హైదరాబాద్‌, కరీంనగర్‌, రామగుండం రోడ్డు వద్ద వెహికల్‌ ఓవర్‌ పాస్‌ నిర్మించనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు మంత్రికి తెలిపారు.

మెదక్‌లో రామాయంపేట ఎన్‌హెచ్‌-44ను క్రాస్‌ చేసేందుకు వెహికల్‌ అండర్‌ పాస్‌, గజ్వేల్‌ రోడ్డులో రామాయంపేట సమీపంలో మరో వెహికల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణం, అక్కన్నపేట వద్ద వెహికల్‌ ఓవర్‌ పాస్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మెదక్‌ జిల్లాలో అక్కన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌ ఉండటంతో అక్కడ వాహనాలు వెళ్లేందుకు రైల్‌ అండర్‌ బ్రిడ్జి నిర్మించనున్నట్లు అధికారులు మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల సిద్దిపేటలో 4 మేజర్‌ జంక్షన్లు, 19 మైనర్‌ జంక్షన్లు, మెదక్‌ జిల్లాలో 4 మేజర్‌ జంక్షన్లు, 15 మైనర్‌ జంక్షన్లు అభివృద్ధి కానున్నట్లు తెలిపారు. రామాయంపేటలో 2.65 కిలోమీటర్లు బైపాస్‌ రోడ్డు రానున్నట్లు అధికారులుమంత్రికి వివరించారు. ఈ పనుల కోసం మెదక్‌ జిల్లాలో 26.82హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, మెదక్‌ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు పనులు వేగంగా జరగాలని, భూసేకరణ పనులు వేగంగా చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు ఫోన్‌ ద్వారా ఆదేశించారు. అటవీ భూములు కూడా సేకరించాల్సి ఉండటంతో ఫారెస్ట్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అటవీ సేకరణ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పనులు వేగంగా జరిపించాలని రెండు జిల్లాల కలెక్టర్లను, ఆదేశించారు. ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మించే చోట వర్షాకాలంలో నీళ్లు నిల్వకుండా జాగ్రత్త వహించాలని, అందుకు అనుగుణంగా డ్రైయినేజీలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. హైవేల వల్ల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సైన్‌ బోర్డులు, రేడియంతో ఏర్పాటు చేసే సూచికలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎమ్మెల్యే క్రాంతి, ఆర్‌అండ్‌బీ నేషనల్‌ హైవేస్‌ విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్‌ఈ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌అడ్‌బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:53:16+05:30 IST

Read more