గంగమ్మఒడికి గణపయ్య
ABN , First Publish Date - 2022-09-09T05:20:27+05:30 IST
సిద్దిపేట పట్టణంలో గురువారం నుంచే నిమజ్జన సందడి మొదలైంది. నవరాత్రుల పూజలందుకొని గణనాథులు గంగమ్మ ఒడికి బయలుదేరాయి. పట్టణంలోని మంత్రి హరీశ్రావు నివాస గృహంలో నెలకొల్పిన గణనాథుడి భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, బతుకమ్మ ఆటలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు నృత్యాలు అలరించాయి.
నేడు పూర్తిస్థాయిలో నిమజ్జనానికి తరలనున్న విగ్రహాలు
సిద్దిపేట కల్చరల్, సెప్టెంబరు 8 : సిద్దిపేట పట్టణంలో గురువారం నుంచే నిమజ్జన సందడి మొదలైంది. నవరాత్రుల పూజలందుకొని గణనాథులు గంగమ్మ ఒడికి బయలుదేరాయి. పట్టణంలోని మంత్రి హరీశ్రావు నివాస గృహంలో నెలకొల్పిన గణనాథుడి భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, బతుకమ్మ ఆటలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు నృత్యాలు అలరించాయి. గణే్షనగర్, శివాజీనగర్, కోటిలింగాలు, నర్సాపూర్ చౌరస్తా, కుషల్నగర్, టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో వివిధ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలోని వినాయుకులు నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాయి. ఈ నిమజ్జనోత్సవంలో యువకులు చిందేశారు. ఇళ్లల్లో నెలకొల్పిన పలు విగ్రహాలను కుటుంబసమేతంగా కోమటిచెరువులో తరలివచ్చి నిమజ్జనం చేశారు. నేడు పట్టణంలోని విగ్రహాలన్నీ నిమజ్జనం చేయనున్నారు. వాహనాలను రకరకాల పూలతో అలంకరించి, విద్యుత్కాంతులతో శోభయాత్రను నిర్వహించేందుకు మండప నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.
నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు : సీపీ శ్వేత
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 8 : వినాయక నిమజ్జనానికి పట్టిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషన్ శ్వేత తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలో నేడు నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి గురువారం శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించారు. లాల్కమాన్, గాంధీ చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, నర్సాపూర్ ఎక్స్రోడ్, విక్టరీ చౌరస్తా, భారత్నగర్ కోమటిచెరువు నిమజ్జన ప్రదేశం, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక నిమజ్జనం శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. శోభయాత్రలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని సీపీ వెల్లడించారు.
మహాగణపతికి గరిక పూజ
సిద్దిపేట కల్చరల్ : సిద్దిపేట పట్టణంలోని స్థానిక రావిచెట్టు హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షోడశ తల మహా గణనాథుడికి గురువారం గరిక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.