సమస్యలను వివరించినా పరిష్కరించరా?
ABN , First Publish Date - 2022-10-12T04:27:00+05:30 IST
సమస్యలను వివరించినా పరిష్కరించడంలేదని మండల సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల సభలో సభ్యుల ఆగ్రహం
కల్హేర్, అక్టోబరు 11: సమస్యలను వివరించినా పరిష్కరించడంలేదని మండల సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ మహిపాల్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. మండలంలోని అధిక శాతం గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. ఇకపై నీటి సరఫరాలో సమస్య రాకుండా చూస్తామని ఏఈ శ్రీకాంత్ సభ్యులకు తెలిపారు. మండలంలో విద్యుత్ సమస్యలు అధికంగా ఉన్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు మండిపడ్డారు. ఐసీడీఎస్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సరిగా లేదన్నారు. తనకు నాలుగు మండలాల బాధ్యతలు ఉన్నాయని, అయినా కూడా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి.. సక్రమంగా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సూపర్వైజర్ జమున తెలిపారు. ఎంపీపీ మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన సిర్గాపూర్ మండలంలో అన్ని శాఖల అధికారులు పూర్తిగా సహకారం అందించి మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పాటిల్ ప్రయాగబాయిమాధవరావ్, ఎంపీడీవో సుజాత, ఎంపీవో శంకర్, రెవెన్యూ అధికారి నారాయణ, ఏఈలు సూర్యకాంత్, శ్రీకాంత్, ఏవో శశాంక్, ఆర్టీసీ ఎంఎస్ పాండు, ఈజీఎస్ టీఏ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.