వరికోతలు ముగిసినా.. బాట పునరుద్ధరణ ఏది?
ABN , First Publish Date - 2022-11-27T22:59:04+05:30 IST
మద్దూరు, నవంబరు 27: ఆక్రమణకు గురైన వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే నక్షాబాటకు కోర్టు ఆదేశాలతో అధికారులు హద్దులు పాతినా బాట పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మద్దూరు, నవంబరు 27: ఆక్రమణకు గురైన వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే నక్షాబాటకు కోర్టు ఆదేశాలతో అధికారులు హద్దులు పాతినా బాట పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామం నుంచి దొమ్మాటకు వెళ్లేందుకు 2 కిలోమీటర్ల నక్షాబాట ఉన్నది. ఏడాది క్రితం బాట మధ్యలో సుమారు 300 మీటర్ల మేర పక్క భూమి రైతులు ఆక్రమణకు పాల్పడి వ్యవసాయం సాగుచేసుకుంటున్నారు. దీంతో తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లనీయకుండా నక్షాబాటను ఆక్రమించి సాగుచేసుకుంటున్న విషయమై పక్కభూమి రైతు అంబటి సుధాకర్ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా నక్షాబాట పునరుద్ధరణకు నోచుకోకుండా పోవడంతో ఆ రైతు వ్యవసాయ భూమిని పడావుగా వదిలేసి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కలెక్టర్కు కోర్టు ఆదేశాలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల హుస్నాబాద్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అజీమ్ స్థానిక ఆర్ఐతో కలిసి ఆక్రమణకు గురైన నక్షాబాటకు పునరుద్ధరణకు చర్యలు చేపట్టి హద్దులు పాతారు. వరికోతల అనంతరం రోడ్డు పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వరి కోతలు ముగిసినా నక్షాబాట పునరుద్ధరణకు నోచుకోవడం లేదని రైతు ఆందోళన చెందుతున్నాడు. ఈ విషయమై మద్దూరు తహసీల్దార్ను వివరణ కోరగా నక్షాబాటకు హద్దులు పాతామని, పాతిన బాట హద్దుల మీదుగా రైతులు వెళ్లాల్సిందేనన్నారు.