ఆత్మగౌరవానికి ప్రతీక భూమి
ABN , First Publish Date - 2022-09-29T04:59:42+05:30 IST
భూమి రైతులకు బతుకుదెరువే కాదు అది వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఆర్ఆర్ఆర్తో చిన్న, సన్నకారు రైతులకు అన్యాయం
రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సరైంది కాదు
రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
సదాశివపేటరూరల్, సెప్టెంబరు 28: భూమి రైతులకు బతుకుదెరువే కాదు అది వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం సదాశివపేట మండలం పెద్దాపూర్లో నిర్వహించిన రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ సరైంది కాదన్నారు. కొందరు బడాబాబుల భూములను కాపాడడానికి చిన్న, సన్న కారు రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. రైతుల జీవనాధారం వ్యవసాయం మాత్రమేనని, వాటిని తీసుకుని డబ్బిస్తే వాళ్లకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఆ భూముల ధరలు కూడా పెరిగాయన్నారు. కొత్త రహదారులను విస్తరించాల్సిన అవసరం లేదని కేవలం ఒకటి, రెండు చోట్ల కలిపితే సరిపోతుందని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే తెలంగాణ జన సమితి తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి, టీజేఎస్ నాయకులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.