అతివృష్టితో ఎర్రబారిన పత్తి.. ఆందోళనలో రైతులు!

ABN , First Publish Date - 2022-10-12T04:26:00+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేతికందే సమయంలో కురిసిన అతివృష్టి రైతులను కలవరపరుస్తున్నది.

అతివృష్టితో ఎర్రబారిన పత్తి.. ఆందోళనలో రైతులు!
అల్లాదుర్గంలో ఎర్రబారిన పత్తి పంట

అల్లాదుర్గం, అక్టోబరు 11: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేతికందే సమయంలో కురిసిన అతివృష్టి రైతులను కలవరపరుస్తున్నది. వర్షపు నీరు నిలవడంతో పత్తి పంట ఎర్రబారడం, కాసిన కాయలు రాలిపోతుండడంతో అల్లాదుర్గం మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పత్తి ధర క్వింటాలుకు రూ.పది వేలకు పైగా పలకడంతో  రైతులు ఈసారి కూడా పత్తి సాగుకే ఆసక్తి చూపారు. మండలంలో 13 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. ఈ సీజన్‌  ఆరంభం నుంచే వర్షాలు భారీగా కురుస్తుండడంతో కొంత మేరకు పంట నష్టం జరిగింది. చేతికొచ్చే సమయంలో కూడా అతిగా వర్షాలు కురియడంతో పంట దెబ్బతింటున్నది. పత్తి పంట ఎర్రబారి, కాసిన కాత రాలిపోతుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎకరానికి 4-5 క్వింటాళ్ల పత్తి దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. పంటల సాగు కోసం చేసిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాల కారణంతోనే పత్తి ఎర్రబారిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.


 

Updated Date - 2022-10-12T04:26:00+05:30 IST