కొప్పులపల్లిలో టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2022-06-13T05:25:22+05:30 IST
మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
జడ్పీ చైర్పర్సన్ వెళ్లగానే తోపులాట
మాసాయిపేట, జూన్ 12: మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంటగదితో పాటు ప్రహరీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కనకమ్మతో పాటు జడ్పీటీసీ రమే్షగౌడ్, టీఆర్ఎస్ మండల నాయకులు హాజరయ్యారు. అయితే జడ్పీ చైర్పర్సన్ వెళ్లిపోయిన తర్వాత గ్రామంలోని సర్పంచ్ కనకమ్మ, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. గ్రామ సర్పంచ్ తమకు గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాల్లో తమకు సమాచారం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ వర్గీయులు ప్రస్తుత సర్పంచ్ వర్గీయులతో నడి రోడ్డుపైనే సుమారు గంటసేపు వాదనకు దిగారు. గ్రామపెద్దలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
అందరికీ సమాచారం ఇస్తున్నాం: సర్పంచ్
గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు అన్ని కార్యక్రమాలకు పూర్తి సమాచారం అందరికీ ఇస్తున్నాం. గ్రామంలో చేపట్టే కార్యక్రమాలకు చాటింపు వేసి పనులు చేపడుతున్నాం. కొందరు కావాలనే తనపై అబండాలు వేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి.