లక్కీ డ్రా పేరుతో మోసం
ABN , First Publish Date - 2022-01-29T04:50:29+05:30 IST
లక్కీ డ్రా పేరుతో బాధితులు మోసపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
రూ.6.20లక్షలు నష్టపోయిన బాధితులు
చేగుంట, జనవరి 28: లక్కీ డ్రా పేరుతో బాధితులు మోసపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు చెందిన మరుగంటి వేణు పంతులు ఆలయ పూజారి. అతడి భార్య కావేరికి రూ.25 లక్షలు లక్కీ డ్రా తగిలిందని పదిహేను రోజుల క్రితం ఓ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన కంపెనీ పేరిట మెస్సేజ్ వచ్చింది. ఈ నగదును పొందాలంటే కొంత నగదు డిపాజిట్ చేయాలని ఆ మెసేజ్లో తెలిపారు. దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి గ్రామంలో తెలిసిన వారి దగ్గర అప్పు చేసి, దుండగులు సూచించిన మూడు వేర్వేరు అకౌంట్లలో రూ.6,20,000 ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత మరో రూ.నాలుగు లక్షలు పంపాలని వాట్స్అప్ కాల్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వేణు శుక్రవారం రాత్రి చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.