పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం
ABN , First Publish Date - 2022-12-30T23:52:12+05:30 IST
పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త హేమలత అన్నారు.
జహీరాబాద్, డిసెంబరు 30: పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త హేమలత అన్నారు. డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27నుంచి 30వరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పోషకాహారంపై అవగాహన శిబిరం శుక్రవారంతో ముగిసింది. జహీరాబాద్లోని పస్తాపూర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో హేమలత మాట్లాడారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని జాడిమల్కపుర్, పస్తాపూర్, పొట్పల్లి, శంసుల్లాపూర్, బిడకన్నే రేజింతల్ గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. చిరుధాన్యాల విశిష్టతను తెలియజేసి పాతకాలపు పంటలను పండించే విధానాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. పోషక విలువలు లేని పదార్థాలు తింటే మహిళల్లో రక్తహీనత ఏర్పడుతుందన్నారు. పోషక పదార్థాలపై అవగాహన కల్పించేందుకు 120 మంది మహిళలు మిశ్రమ విధానంలో పలురకాల చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల వంటలను పండిచారని చెప్పారు. చిరుధాన్యాలతో మహిళా సభ్యులు 50 రకాల వంటలను తయారుచేసి వడ్డించారు.