ఆటోను ట్రక్కు ఢీకొని ఇద్దరి దుర్మరణం
ABN , First Publish Date - 2022-11-02T23:45:56+05:30 IST
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద ఘటన
పుల్కల్, నవంబరు 2: ఆటోను బొలెరో ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చౌటకూర్ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఫతేనగర్కు చెందిన ఎండీ ఇర్ఫాన్(20), ఎండీ.ఫరీద్(28) జోగిపేటలో పూలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మొజాంజాహీ మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున పూలు కొనుగోలు చేసుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. చౌటకూర్ మండలం తాడ్దానిపల్లి చౌరస్తాకు చేరుకోగా.. జోగిపేట నుంచి రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో ట్రక్కు(ఎంహెచ్26బీఈ 8337) ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫరీద్, ఇర్ఫాన్లు ఆటోలో ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హర్ధాపూర్ తాలుకా నందుస గ్రామానికి చెందిన హట్కర్ సునీల్ బోలేరో వాహనాన్ని సుల్తాన్పూర్ జాతీయ రహదారి డైవర్షన్ వద్ద నుంచి పూర్తిగా రాంగ్రూట్లో నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామునే ప్రమాదం జరగడంతో రోడ్డు వెంట వెళ్తున్నవారు గమనించి ట్రక్కు డ్రైవర్ సునీల్ను పట్టుకుని తాళ్లతో బంధించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పుల్కల్ ఎస్ఐ గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో జోగిపేట పట్టణానికి చెందిన ఇద్దరు యువకుల మృతి పట్ల అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.