గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2022-11-19T00:05:49+05:30 IST
రాళ్లకత్వ, ఊట్ల గ్రామాల పరిధిలో కంకర క్యారీల ఏర్పాటుపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్, పీసీబీ ఈఈ కుమార్పాటక్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా ముగించారు.
మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు
ముగ్గురితోనే ముగించిన అధికారులు
జిన్నారం, నవంబరు 18: రాళ్లకత్వ, ఊట్ల గ్రామాల పరిధిలో కంకర క్యారీల ఏర్పాటుపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్, పీసీబీ ఈఈ కుమార్పాటక్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా ముగించారు. అభిప్రాయ సేకరణకు వేదికను రాళ్లకత్వ శివారులో ఏర్పాటు చేయగా ఊట్ల గ్రామస్థులు, నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాళ్లకత్వలో స్థానికులు కూడా వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి క్వారీల ఏర్పాటు వద్దని ఆందోళన చేశారు. వేదిక వద్దకు కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే రాగా అధికారులు 15 నిమిషాల్లోనే కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. కంకర మిషన్లు, క్వారీల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, ఉపాధ్యక్షుడు రమేష్, సర్పంచులు ఆంజనేయులు, రమామల్లేశ్ స్పష్టం చేశారు. తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులతో అభిప్రాయ సేకరణ ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. అభిప్రాయ సేకరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వేదిక వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.