వృద్ధ దంపతులకు దక్కిన ‘డబుల్’ ఇల్లు
ABN , First Publish Date - 2022-11-30T23:36:47+05:30 IST
‘గంజికే గోడు... గణేష్ మండపమే గూడు..! దయనీయ స్థితిలో వృద్ధ దంపతులు’ శీర్షికన గత ఏడాది సెప్టెంబరు 27న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించారు.
సంగారెడ్డి టౌన్, నవంబరు 30: కోహీర్కు చెందిన మేతరి తులసీరాం(75), నర్సమ్మ(65) దంపతులు 40 ఏళ్ల క్రితం జోనోపాధి కోసం సంగారెడ్డికి వచ్చారు. మానసిక విలాంగుడైన రాజు (30)తో కలిసి సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం (ఎఫ్ఆర్ఎస్) ప్రధాన గేటు వద్ద చిన్న పూరి గుడిసెలో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం తులసీరాం కాళ్లు పక్షవాతంతో చచ్చుపడియాయి. అప్పట్లో వర్షాలకు వారి నివాస గుడిసె కూలిపోయింది. నాటి నుంచి వారు ఎఫ్ఆర్ఎస్ మెయిన్గేట్ వద్ద ఉన్న గణపతి మండపంలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. వారి దీనస్థితిపై ‘గంజికే గోడు... గణేష్ మండపమే గూడు..! దయనీయ స్థితిలో వృద్ధ దంపతులు’ శీర్షికన గత ఏడాది సెప్టెంబరు 27న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించారు. తహసీల్దార్ స్వామి, కౌన్సిలర్ శ్రీకాంత్ వారిని పరామర్శించి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫసల్వాది శివారులో నిర్మించిన వృద్ధ దంపతులకు డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం కలెక్టర్ శరత్, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ వృద్ధురాలికి అందజేశారు.