సంగారెడ్డి జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు
ABN , First Publish Date - 2022-04-24T05:41:45+05:30 IST
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తిచేశారు. రాత పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 15,711 మంది, వొకేషనల్లో 1413 (మొత్తం-17,124) మంది పరీక్షలు రాయనున్నారు.
మే 6 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు
పరీక్ష కేంరద్రాల గుర్తింపునకు ప్రత్యేక యాప్
ఇంటర్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్
సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 23 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తిచేశారు. రాత పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 15,711 మంది, వొకేషనల్లో 1413 (మొత్తం-17,124) మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 14,190 మంది, వొకేషనల్లో 1,200 (మొత్తం 15,390) మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 47 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించనున్నారు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో సులువుగా గుర్తించేందుకు జీపీఎస్కు అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రానికి గుర్తింపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీఎస్బీఐఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఎగ్జామ్ సెంటర్ లొకేటర్లో పరీక్షా కేంద్రం కోడ్ నంబర్ నమోదు చేస్తే లొకేషన్ను, అక్కడికి చేరుకునేందుకు దారిని చూపిస్తుంది. ఈ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయాస తప్పనుంది.
పకడ్బందీ ఏర్పాట్లు : గోవిందరామ్, ఇంటర్మీడియట్ అధికారి, సంగారెడ్డి
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్తు, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలు తదితర సౌకర్యాలు ఉన్న కేంద్రాలనే ఎంపికచేశాం. నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహిస్తాం.