Mandus: వణికిస్తున్న ‘మాండస్’
ABN , First Publish Date - 2022-12-10T03:18:23+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్’ తుఫాన్ తీరప్రాంత జిల్లాలను వణికిస్తోంది.
మహాబలిపురానికి అతి చేరువగా తుఫాన్
పెనుగాలులు.. ఎగసిపడుతున్న అలలు
అర్ధరాత్రి తీరం దాటుతుందని అంచనా
దక్షిణ కోస్తా, రాయలసీమ,
తమిళనాడుల్లో విస్తారంగా వర్షాలు
తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు
రెడ్ అలెర్ట్.. నేడు, రేపు వర్షాలు
తిరుపతిలో దిగకుండా 2 ఫ్లైట్లు వెనక్కి
రాష్ట్రానికి వర్షసూచన.. వణికిస్తున్న చలి
కామారెడ్డిలో 5.9 డిగ్రీలు
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్) : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్’ తుఫాన్ తీరప్రాంత జిల్లాలను వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. అలలు ఎగసిపడుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర తుఫాన్ శుక్రవారం ఉదయానికి కొద్దిగా బలహీనపడి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య మహాబలిపురానికి 65 కిలోమీటర్లు ఆగ్నేయంగా, చెన్నైకి 100 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. సముద్రం నుంచి తీరం దిశగా పెద్దఎత్తున మేఘాలు రావడంతో భారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు భారత వాతావరణ శాఖరెడ్ మెసేజ్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా, మాండస్ తుఫాన్ వాయవ్యంగా పయనించి శుక్రవారం రాత్రి 11.30 నుంచి అర్ధరాత్రి 2.30 గంటల మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. తరువాత శనివారం తెల్లవారుజాము నాటికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 65నుంచి 75, అప్పుడప్పుడు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శనివా రం ఉదయం నుంచి గాలుల ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని వా తావరణ శాఖ తెలిపింది. ఇంకా చెన్నై పరిసరాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు, పలుచోట్ల అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు లోని 15జిల్లా ల్లో విద్యాలయాలకు సెలవులు ఇచ్చారు. పలు ప్రైవే టు కార్యాలయాలకు సైతం సెలవు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కడలూ రు తదితర జిల్లాల్లో శుక్రవారం భారీవర్షాలుకురవడంతో జనజీవనం స్తంభించడంతో పాటు రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి వి విధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 13 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. శనివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అతిభారీగా, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 11న రాయలసీమ, ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖ ఓడరేవుల్లో రెండో నంబరు భద్ర తా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తిరుమలలో శుక్రవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుని ఉదయం 7.40గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానం, బెంగుళూరు నుంచి తిరుపతి మీదుగా వైజాగ్ వెళ్లాల్సిన స్సైస్జెట్ విమానం వాతావరణం అనుకూలించక 20నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లిపోయాయి. ముంబై వెళ్లాల్సిన విమానం మళ్లీ 3గంటలు ఆలస్యంగా తిరుపతి చేరుకుని ముంబై బయల్దేరి వెళ్లింది. మరో సర్వీసును అధికారులు రద్దు చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని ఆదాని పోర్టులో 6వ నం బరు హెచ్చరిక ఎగురవేశారు. కాకినాడ జిల్లాలో తీరప్రాంత మండలాలైన తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ, కరప, తాళ్లరేవు మండలాల్లో ఈదురుగాలులు ఎక్కువయ్యాయి. గంటకు 45నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో తీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో గురువారం రాత్రి వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మాం డస్ గురువారం మధ్యాహ్నం తరువాత తీవ్ర తుఫాన్గా మారింది. తీరానికి సమీపంగా వస్తున్న క్రమంలో పశ్చిమ దిశ నుంచి చలి వాతావరణంతో కూడిన పొడిగాలులు తుఫాన్ వైపు వీచాయి. దీంతో తీవ్ర తుఫాన్ శుక్రవారం ఉదయానికి బలహీనపడి తుఫాన్గా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో అత్యధికంగా 130 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. నాయుడుపేట, సైదాపురం, మునుబోలు, వెంకటాచలం, కోట, అల్లూరు, విడవలూరు మండలాల్లో 100మి.మీ.కు పైగా వర్షం పడింది. అనేకచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.