వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందే..

ABN , First Publish Date - 2022-12-09T23:54:07+05:30 IST

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్సాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందే..
వాల్మీకి బోయలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

- వాల్మీకి బోయల దీక్షలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

- మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తామని హామీ

పాలమూరు, డిసెంబరు 9 : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్సాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం వాల్మీకి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామలక్ష్మణ్‌, బండల శ్రీను, మద్దిగట్ల కృష్ణ అధ్యక్షతన చేపట్టిన దీక్షాశిబిరానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డితో కలిసి మంత్రి వచ్చారు. వాల్మీకులకు ఎస్టీ హోదా కోసం చేస్తున్న దీక్షకు వారు సంఘీబావం తెలిపారు. కేంద్రం మొదటి నుంచి వాల్మీకి బోయల అంశంపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వాల్మీకుల స్థితిగతులపై చెల్లప్ప కమిటీ నివేదిక ఎప్పుడో వచ్చిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి కేంద్రా నికి పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నేటికీ ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవటం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ జనగణన విషయంలో కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో యుగంధర్‌ నాయుడు, చక్రాపూర్‌ సర్పంచ్‌ శేఖర్‌, రాచాల శ్రీను, గొండ్యాల ఎంపీపీ, పెద్ద నరసింహ, ఎర్ర నరసింహ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:54:24+05:30 IST