డాక్టర్ రెఫర్ చేస్తేనే పరీక్షలు చేయాలి
ABN , First Publish Date - 2022-09-12T04:55:59+05:30 IST
డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ నిర్వాహకులు క్వాలిఫైడ్ డాక్టర్ రెఫర్ చేసిన ప్రిస్ర్కిప్షన్ ఆధారంగానే పరీక్షలు చేసి, రిపోర్టులను రెఫర్ చేసిన డాక్టర్కే పంపించాలని డాక్టర్ రవికుమార్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్రెడ్డి చెప్పారు.
ఆర్ఎంపీలు పంపిస్తే చేయొద్దు
డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు రికార్డులను నిర్వహించాలి: డాక్టర్ రవికుమార్
గద్వాల క్రైం, సెప్టెంబరు 11: డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ నిర్వాహకులు క్వాలిఫైడ్ డాక్టర్ రెఫర్ చేసిన ప్రిస్ర్కిప్షన్ ఆధారంగానే పరీక్షలు చేసి, రిపోర్టులను రెఫర్ చేసిన డాక్టర్కే పంపించాలని డాక్టర్ రవికుమార్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్రెడ్డి చెప్పారు. ‘ఆర్ఎంపీలు అడ్డదార్లు’ అన్న శీర్షికన ఆర్ఎంపీలు పాల్పడుతున్న అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందూనాయక్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లను డాక్టర్ రవికుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. రికార్డులను, రిపోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ల్యాబ్ నిర్వాహకులు ఎవరూ ఆర్ఎంపీలు రెఫర్ చేసిన వ్యక్తుల నుంచి బ్లడ్ శ్యాంపిల్స్ కలెక్ట్ చేసి, పరీక్షలు చేయొద్దన్నారు. అలా చేస్తే హాస్పిటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్, ల్యాబ్ నిర్వాహకులు రికార్డులను, రిపోర్టులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గల డయాగ్నోస్టిక్ హబ్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.