అత్యున్నత విద్య అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే

ABN , First Publish Date - 2022-11-30T23:42:30+05:30 IST

దేశంలోనే అత్యున్నత గురుకుల విద్యను అందిస్తున్న రాష్టంగా తెలంగాణ నిలిచిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం నూతన డిగ్రీ కళాశాలను మంత్రి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అత్యున్నత విద్య అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

దేవరకద్రలో డిగ్రీ కళాశాల, కౌకుంట్లలో మండల కేంద్రం ప్రారంభం

దేవరకద్ర, నవంబరు 30: దేశంలోనే అత్యున్నత గురుకుల విద్యను అందిస్తున్న రాష్టంగా తెలంగాణ నిలిచిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం నూతన డిగ్రీ కళాశాలను మంత్రి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల చదువు కోసం గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు సన్నాల భోజనం అందిస్తున్న ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు సకల సదుపాయాలతో విద్యను అందిస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకోడానికి కూడా పాఠశాలలు సరిగా ఉండేవి కావన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే భయపడేవారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ వేస్తుందన్నారు. డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

పాలన పారదర్శకం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం అనేక కొత్త మండలాలను ఏర్పాటు చేసిందన్నారు. అందుల్లో భాగంగా కౌకుంట్ల గ్రామ ప్రజల విజ్జప్తి మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి చొరవతో 13 గ్రామాలతో కౌకుంట్లను మండలంగా ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కౌకుంట్ల మండలాన్ని ప్రారంభించడానికి బుధవారం వారు మండల కేంద్రానికి వచ్చారు. మంత్రి, ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఆల, జడ్పీ చైర్‌ పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తహసీ ల్దార్‌, ఎంఈవో, వ్యవసాయ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కౌకుంట్లతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రెవెన్యూతో పాటు ఇతర పనులను ఇక్కడే చేసుకో వచ్చన్నారు. పేరూర్‌ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, మండల రైతులకు సాగు నీటిని అందిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ రమాశ్రీకాంత్‌, జడ్పీటీసీ అన్నపూర్ణ శ్రీకాంత్‌, సర్పంచ్‌ స్వప్న కిషన్‌రావు, వైస్‌ ఎంపీపీ సూజాత శేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, కొండరెడ్డి గోపాల్‌, కిష్టన్న బచ్చి, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో శ్రీనువాసులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:42:32+05:30 IST