లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-11-24T23:27:12+05:30 IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు.
- వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, నవంబరు 24 : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. 2023 జనవరి 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉంటే లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. మిగిలిన అర్హుల వివరాలతో వెయిటింగ్ జాబితాను తయారు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, అధికారులు పాల్గొన్నారు.