అర్హత గల దరఖాస్తులను రెగ్యులరైజేషన్‌ కమిటీకి సిఫారసు చేయండి

ABN , First Publish Date - 2022-11-24T23:21:17+05:30 IST

పోడు భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన 17,282 దరఖాస్తుల నుంచి ఆర్డీవో లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులు పొందుపర్చిన అన్ని పత్రాలు సాగు ఆధారాలతో సమర్పించి, అర్హత గల దరఖాస్తులను వెంటనే జిల్లా రెగ్యులరైజేషన్‌ కమిటీకి సిఫారసు చేయాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆర్డీవోలను ఆదేశించారు.

అర్హత గల దరఖాస్తులను రెగ్యులరైజేషన్‌ కమిటీకి సిఫారసు చేయండి

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన 17,282 దరఖాస్తుల నుంచి ఆర్డీవో లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులు పొందుపర్చిన అన్ని పత్రాలు సాగు ఆధారాలతో సమర్పించి, అర్హత గల దరఖాస్తులను వెంటనే జిల్లా రెగ్యులరైజేషన్‌ కమిటీకి సిఫారసు చేయాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆర్డీవోలను ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీవోలతో పోడు భూముల క్రమబద్ధీకరణపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్డీవో లాగిన్‌కు వచ్చిన గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల క్రమబద్ధీకరణ కోసం నమోదు చేసుకున్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను జిల్లా రెగ్యులరైజేషన్‌ కమిటీకి సిఫారసు చేయాలని ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమగ్ర వివరాలను తెప్పించుకొని వెంటనే జిల్లా కమిటీకి చేరవేయాలన్నారు. ఆర్డీవోల వారిగా ఉన్న దరఖాస్తుల వివరాలను ఆర్డీవోలకు వివరించారు. అర్హతకు గల పత్రాల వివరాలను కలెక్టర్‌ వివరించారు. లబ్ధిదారుల సిఫారసు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అర్హత ఉన్న గిరిజనులకు పట్టాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో సిఫారసు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్‌, డీపీవో కృష్ణ, ఆర్డీవోలు నాగలక్ష్మి, రాజేష్‌కుమార్‌, పాండునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:21:18+05:30 IST