లే అవుట్
ABN , First Publish Date - 2022-12-02T00:08:16+05:30 IST
డీటీసీపీ లే అవుట్లలో లెక్క లేనన్నీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కట్టడాల సంగతి అటు ఉంచితే టెనెంట్ ఉన్న వ్యవసాయ భూములకు కూడా నో పీటీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రెవెన్యూ అధికారులు కొత్త అక్రమాలకు తెర తీస్తున్నారు.
- డీటీసీపీ లేఅవుట్లలో అక్రమాలు
- టెనెంట్ ఉన్నా లేనట్లు తహసీల్దార్ ఆఫీస్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
నాగర్కర్నూల్, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి) : డీటీసీపీ లే అవుట్లలో లెక్క లేనన్నీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కట్టడాల సంగతి అటు ఉంచితే టెనెంట్ ఉన్న వ్యవసాయ భూములకు కూడా నో పీటీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రెవెన్యూ అధికారులు కొత్త అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇందులో నాగర్కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. సాధారణంగా వ్యవసాయ భూమిని లే అవుట్ చేసేక్రమంలో అందులో వాస్తవ హక్కుదారులు ఎవరు? టెనెంట్ ఉన్నారా..? లేదా.. ఉంటే టెనెంట్ చట్టం ప్రకారం వారికి వాటా అందిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. పంచానామా నిర్వహించి టెనెంట్ ఉన్నారా లేదా నిర్ధారించుకున్న తర్వాతే నోపీటీ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా నాగర్కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ఇటీవల దేశిటిక్యాల శివారులోని మూడెకరాల భూమిలో వెంచర్ వేయగా అందులో ఒక సర్వే నెంబరులో టెనెంట్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా అనుమతివ్వడంతో నాలా కన్వర్షన్, డీటీసీపీ అప్రూవల్ వచ్చింది. అయితే దీని చుట్టు పక్కల ఉన్న రెండు సర్వే నెంబర్లలో కూడా టెనెంట్ ఉన్నప్పటికీ వారికి రావాల్సిన హక్కులు ఇవ్వకుండానే విక్రయాలు జరిగిపోవడంతో టెనెంట్ దారులు లబోదిబోమంటున్నారు. తమ గోడు వెల్లబోసుకోవడా నికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే అధికారులు ఎవరూ పట్టించుకోవ డం లేదని తమ హక్కులకు సంబంధించి ఉన్న ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయం గురించి వివరణ తీసుకోవడానికి తహసీల్దార్ అందుబాటులోకి రాకపోవడం వెనక అంతార్యమేమిటో బోధపడడం లేదు. నోపీటీ సర్టిఫికేట్ల జారీ చేయడంపై సమగ్రంగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.