ఆకలి, పేదరికం ఎరిగిన వ్యక్తి జగ్జీవన్రామ్
ABN , First Publish Date - 2022-04-06T04:49:27+05:30 IST
ఆకలి, పేదరికం ఎరిగిన వ్యక్తిగా దేశ వ్యవసాయ రంగం అభివృద్ధ్దిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహోన్నతుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
- దళితబంధుతో ప్రతీ దళితుడు ధనవంతుడు కావాలి: జడ్పీ చైర్మన్
- పోరాటంలో చివరి వరకు నిలబడే వ్యక్తే నాయకుడు: కలెక్టర్
- ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
వనపర్తి టౌన్, ఏప్రిల్ 5: ఆకలి, పేదరికం ఎరిగిన వ్యక్తిగా దేశ వ్యవసాయ రంగం అభివృద్ధ్దిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహోన్నతుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మంత్రి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ అర్థ శతాబ్దం పాటు చట్టసభల్లో ఏకదాటిగా కొనసాగిన వ్యక్తి మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా దేశ ప్రజల ఆకలి తీర్చిన పుణ్యమూర్తి జగ్జీవన్రామ్ అని అన్నారు. నేడు సమజంలో సమానత్వం తీసుకురావడం కోసం కులాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులను సన్మానించి నేటి తరాలకు వాటి గొప్పతనాన్ని వివరించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. జగ్జీవన్ రామ్ మేథస్సును గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టరేట్ అందించి గౌరవించిందన్నారు. కానీ అప్పటి ప్రభుత్వమే జగ్జీవన్ రామ్ను పూర్తి స్ధాయిలో గుర్తించలేకపోయిందని అన్నారు.
ప్రభుత్వం దళితులకు అందిస్తున్న దళితబంధు పథకంతో ప్రతీ దళితుడు ధనవంతుడు కావాలని జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి అన్నారు. పోరాటంలో చివరి వరకు నిలబడిన వారే నిజమైన ఉద్యమ నాయకులు అని కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా అన్నారు. అలా ఉద్యమాలు చేసి నేటి సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన వారే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్లు అని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ జయసుధ, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నుషిత, ఉత్సవ కమిటీ కన్వీనర్ ఎర్రవల్లి వీరప్ప, కో కన్వీనర్ గంధం లక్ష్మయ్య, మెంటపల్లి రాములు, జీఎంఎం మధుకర్, మానిటరింగ్ కమిటీ సభ్యులు కోళ్ల వెంకటేష్, గంధం నాగరాజు, మలిపెద్ది చంద్రశేఖర్, మిషెక్, విభూది నారాయణ, దళిత సంఘాల నాయకులు మీసాల రాము, సిరిగిరి మన్నెం, గంధం భగత్, వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.