వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-29T05:49:35+05:30 IST

వసతి గృహాలలో వంటగదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- అధికారులతో సమీక్ష

గద్వాల క్రైం, సెప్టెంబరు 28 : వసతి గృహాలలో వంటగదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతీ వసతిగృహంలో వైద్యసిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ప్రతీ వసతిగృహాన్ని తనిఖీ చేసి ప్రతీ విద్యార్ధిని చెక్‌ చేయాలని సూచించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రక్తహీనత ఉన్న పిల్లలకు అవసరమయ్యే ఐరన్‌ టాబ్లెట్లు ఇవ్వాలన్నారు. మెనూ వివరాలను బోర్డుపై రాయించాలని వంట ఏజెన్సీ వారికి చెప్పారు. కుళ్లిన కూరగాయలను వండితే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగా చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా అధికారులు ఉన్నారు.


విద్యార్థికి అభినందనలు

జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు సాధించిన సాయినిఖిల్‌ను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అభినందించారు. గద్వాల పట్టణానికి చెందిన లక్ష్మయ్యశెట్టి, ప్రశాంతిల కుమారుడు సాయినిఖిల్‌ జేఈఈ అడ్వాన్స్‌లో 232 ర్యాంకు సాధించి కాన్పూర్‌లో సీటు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థిని కలెక్టర్‌ అభినందించి పుస్తకాన్ని బహూకరించారు. 

Updated Date - 2022-09-29T05:49:35+05:30 IST