డీజిల్‌ ట్యాంకర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-09-18T04:41:23+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఈనెల 5వ తేదీన ఓ డీజిల్‌ ట్యాంకర్‌ను పట్టుకొన్న ఘటన మరువక ముందే శనివారం ఉదయం మళ్లీ అక్రమంగా డీజిల్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ను రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

డీజిల్‌ ట్యాంకర్‌ పట్టివేత

అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

నలుగురిపై కేసు నమోదు


గద్వాల క్రైం, సెప్టెంబరు 17: జోగుళాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఈనెల 5వ తేదీన ఓ డీజిల్‌ ట్యాంకర్‌ను పట్టుకొన్న ఘటన మరువక ముందే శనివారం ఉదయం మళ్లీ అక్రమంగా డీజిల్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ను రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి కేటీ దొడ్డి ఎస్సై కుర్మయ్య, డీఎస్‌వో రేవతి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాహనాలు తనిఖీ చేపట్టారు. రాయిచూర్‌ నుంచి తెలంగాణలోకి వస్తున్న డీజిల్‌ ట్యాంకర్‌ను ఆపి తనిఖీ చేయగా 20వేల లీటర్ల డీజిల్‌ నిల్వ ఉంది. ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేవు. ఈ డీజిల్‌ రాయిచూర్‌లోని శివశక్తి పంపు నుంచి కొల్లాపూర్‌కు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన లారీ ఓనర్‌ శేఖర్‌రెడ్డి, నల్గొండకు చెందిన లారీ డ్రైవర్‌ శ్రీనుతో ఈ డీజిల్‌ లోడ్‌ను కొల్లాపూర్‌కు చెందిన మహేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలకు పంపేందుకు ఒప్పందం చేసుకొని లోడ్‌ను దించే క్రమంలో నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుబడిందన్నారు. ఇందులో డీజిల్‌ విలువ రూ.19,56,400, ట్యాంకర్‌ విలువ రూ.15,00,000 ఉంటుందని, వీటిని సీజ్‌ చేసి జిల్లా కేంద్రంలోని భీమన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉంచామని డీఎస్‌వో రేవతి వివరించారు. ఇందులో నలుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనును పోలీసుల అదుపులో ఉంచినట్లు డీఎస్‌వో తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌వోతో పాటు, డీటీ కేశవులు, ప్రదీప్‌ ఉన్నారు.

Updated Date - 2022-09-18T04:41:23+05:30 IST