పూణె నుంచి వచ్చి మృత్యు ఒడికి..
ABN , First Publish Date - 2022-12-06T23:00:58+05:30 IST
బతుకుదెరువు కోసం పూణెకు వెళ్ళిన ఓ యువకుడు తాండలో తుల్జామాత పండుగలు చేస్తుండటంతో ఎంతో సంతోషంగా వచ్చాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ద్విచక్ర వాహనం, టెన్ టైర్ లారీ ఢీ
మహబూబ్నగర్, డిసెంబరు 6 : బతుకుదెరువు కోసం పూణెకు వెళ్ళిన ఓ యువకుడు తాండలో తుల్జామాత పండుగలు చేస్తుండటంతో ఎంతో సంతోషంగా వచ్చాడు. వచ్చిన కొన్ని గంటలకే పనిమీద తండాకు చెందిన మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పట్టణానికి వెళ్ళి తిరిగి తండాకు వస్తుండగా వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. అప్పటిదాక తాండలో ఉన్న పండుగ వాతావరణం విషాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం రాజీవ్నాయక్ తండాకు చెందిన విస్లావత్ ప్రకాశ్ (24) మహారాష్ట్రలోని పూణె నగరానికి వెళ్ళి మేస్త్రి పనులు చేసుకుంటున్నారు. గ్రామంలో పండుగలు చేస్తుండటంతో మంగళవారం తెల్లవారుజామున వచ్చాడు. కొద్దిసేపు తండాలో గడిపి తన స్నేహితుడు వెంకటేశ్(23)తో కలిసి పనిమీద జిల్లా కేంద్రానికి వచ్చి సాయంత్రం తిరిగి తండాకు వెళుతుండగా అడవి వెంకటాపూర్ దాటాక రేగడిగడ్డ తండా దగ్గర ఎదురుగా వచ్చిన టెన్ టైర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు రోడ్డుపై పడగా వారిపై నుంచి లారీ వెళ్ళింది. నాలుగు టైర్లు మీద నుంచి వెళ్ళడంతో యువకుల దేహాలు ఛిద్రమయ్యాయి. శరీర భాగాలు తెగిపడ్డాయి. తల పగిలి మెదడు బయటకు వచ్చింది. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో అక్కడిక క్కడే మృతి చెందారు. అప్పటిదాక పండగ హడావిడిలో ఉన్న తండా వాసులకు విషయం తెలియడంతో దిగ్ర్బాంతికి లోనయ్యారు. మంగళవారం రాత్రి పండగ ఉండగా తాండకు చెందిన ఇద్దరు యువకులు చనిపో వడంతో తండాలో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండావాసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాద ఘోర దృశ్యాలను చూసి కన్నీరుమున్నీ రయ్యారు. ఛిద్రమైన మృతదేహాలను చూసేందుకు కూడా బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. విస్లావత్ ప్రకాశ్ పెళ్ళి సంబంధాలు కూడా చూసుకుందామని తండాకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంకటేశ్ ముంబాయిలో ప్లంబర్గా పని చేసేవాడు. కొన్నాళ్ళ క్రితమే తండాకు వచ్చాడు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను జనరల్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.