నర్సరీల్లో బయో తొట్లను వాడాలి

ABN , First Publish Date - 2022-02-17T05:14:41+05:30 IST

పర్యావరణాన్ని కాపాడుతూ నర్సరీలలో ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా బయో తొట్లను వాడాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ అన్నారు.

నర్సరీల్లో బయో తొట్లను వాడాలి
బయోతొట్టిని తయారు చేసిన విద్యార్థిని శ్రీజను అభినందిస్తున్న ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌

- ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ  ప్రియాంక వర్గీస్‌

గద్వాల క్రైం, ఫిబ్రవరి 16 : పర్యావరణాన్ని కాపాడుతూ నర్సరీలలో ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా బయో తొట్లను వాడాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ అన్నారు. ముఖ్యమంత్రి సూచనతో బయోతొట్ల తయారీపై బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తెలంగాణ ఇన్సోవేషన్స్‌ సెల్‌ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీదొడ్డి మండలం చింతలకుంట జడ్పీ హైస్కూల్‌ పదవ తరగతి విద్యార్థిని శ్రీజ తాను తయారు చేసిన బయో తొట్టి గురించి ఓఎస్డీకి వివరించారు. అనంతరం ఓఎస్డీ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదట మన రాష్ట్రంలోనే వేరుశనగ పొట్టుతో బయోతొట్టిని తయారు చేయడం గర్వకారణమన్నారు. ఇది తెలంగాణ హరితహారంలో ఒక ముందడగన్నారు. రాష్ట్రంలో ముందుగా కేటీదొడ్డి మండలంలోని నర్సరీలలో బయో తొట్లలో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్నోవేషన్‌ ప్రతినిధులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని నర్సరీల్లో బయో తొట్లను వినియోగిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు బయోతొట్టి ఎంతో ఉపయోగమని, వాటిని తయారు చేసిన శ్రీజకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో, మండలాలలో నర్సరీల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా కాపాడుకోవాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించి, పెంచినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ జిల్లా అటవీశాఖ అధికారి క్షితిజ, డీఆర్డీఏ ఉమాదేవి, గైడ్‌ టీచర్‌ అగస్టీన్‌, చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి శాంతతాటం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-17T05:14:41+05:30 IST