39 గొర్రె పిల్లలు మృతి
ABN , First Publish Date - 2022-12-13T22:58:26+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని జూలకల్లు గ్రామస్థుడు గొల్ల ఆంజనేయులుకు చెందిన 39 గొర్రె పిల్లలను గుర్తుతెలియని దుండగులు సోమవారం రాత్రి గొంతు కోసి దారుణంగా చంపారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తలలు, కాళ్లు విరిచి, కత్తులతో పొడిచి చంపిన దుండగులు
జీవాల విలువ రూ. 5 లక్షలు
వడ్డేపల్లి, డిసెంబరు 13 : జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని జూలకల్లు గ్రామస్థుడు గొల్ల ఆంజనేయులుకు చెందిన 39 గొర్రె పిల్లలను గుర్తుతెలియని దుండగులు సోమవారం రాత్రి గొంతు కోసి దారుణంగా చంపారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయులు తనకు ఉన్న చిన్న గొర్రె పిల్లలను అయిజ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఒక పొలంలో ఫెన్సింగ్లో ఉంచి వాటి తల్లులను మేతకు తీసుకువెళ్లి మరోచోట ఉంచాడు. రాత్రి వేళ ఎవరూ లేనిది చూసిన గుర్తుతెలియని దుండగులు ఫెన్సింగ్లోని గొర్రె పిల్లల కొంతులుకోసి, కత్తులతో పొడిచి, కాళ్లు విరిచి బీభత్సం చేశారు. దీంతో 39 గొర్రెపిల్లలు మృతి చెందగా, మరో 20 గొర్రె పిల్లలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మంగళవారం తెల్లవారిన తర్వాత చూసుకున్న బాధితుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని శాంతినగర్ ఎస్ఐ శ్రీనివాస్నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. గొర్రె పిల్లల పోస్టుమార్టం అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటన అయిజ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని, ఎస్ఐ అందుబాటులో లేకపోవడం వల్ల విచారణ చేపట్టామని శాంతినగర్ ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన గొర్రె పిల్లల విలువ రూ. 5 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. గొర్రె పిల్లలను పాశవికంగా చంపిన తీరు దారుణమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, చనిపోయిన జీవాలకు డాక్టర్ పుష్పలత పంచనామా నిర్వహించారు.