సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ వైరస్‌

ABN , First Publish Date - 2022-10-08T11:09:05+05:30 IST

సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ వైరస్‌

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో వ్యాధి సోకిన ఆవు గుర్తింపు 

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 7: సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన ఉప్పుల లింగయ్య అనే రైతు.. తన ఆవు కుంటుతుండడంతో వెటర్నరీ ఆస్పత్రికి శుక్రవారం తీసుకువచ్చారు. ఆవు కుడివైపు చర్మంపై అసాధారణంగా బొబ్బలు ఉండటాన్ని గుర్తించిన పశువైద్యశాఖ అధికారి వేణుగోపాల్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ ఆవు లంపిస్కిన్‌ వైరస్‌ బారినపడినట్టు తేల్చారు. అనంతరం జిల్లాలోని చింతలపాలెం, మోతె, మేళ్లచెర్వు, కోదాడ మండలాల్లోని పలు గ్రామాల్లోని దాదాపు 23 పశువులకు లంపీస్కిన్‌ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పశువైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరావు తెలిపారు. లంపీస్కిన్‌ వ్యాధి సోకిన ఆవులు, గేదెలను మంద నుంచి వేరు చేయాలని, రాత్రి వేళ వాటికి వేపాకు పొగ వేయాలని సూచించారు.

Updated Date - 2022-10-08T11:09:05+05:30 IST