ఆదిలాబాద్ సీసీఐని పునఃప్రారంభించండి
ABN , First Publish Date - 2022-01-03T09:06:47+05:30 IST
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు లేఖ రాశారు. సీసీఐని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల సీసీఐ టౌన్షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందన్నారు. భౌగోళికంగా ఆదిలాబాద్కున్న సానుకూలతను ఉపయోగించుకుని పునఃప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి సిమెంట్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్థి చెందుతుందన్నారు.
గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడి సీసీఐని పునః ప్రారంభిస్తే నూతన పరిశ్రమలకు ఇచ్చే మాదిరే అన్ని ప్రోత్సాహకాలతో పాటు పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, ఇది తెలంగాణ యువతకు, ముఖ్యంగా ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేసినట్టేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.