ఏసీబీకి చిక్కిన విద్యుత్ డీఈ, యూడీసీ, జేవో
ABN , First Publish Date - 2022-03-23T09:38:49+05:30 IST
లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు లైన్మన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
హైదరాబాద్, నల్లగొండలోని వారి ఇళ్లలో సోదాలు
మిర్యాలగూడ అర్బన్, మార్చి 22: లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు లైన్మన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాన్స్కో కార్యాలయంలో మంగళవారం జరిగింది. మిర్యాలగూడలోని రెడ్డికాలనీ లైన్మన్గా గుంటూరు శ్రీనివాస్ పని చేస్తున్నాడు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్మన్గా విధుల్లో చేరాడు. అయితే, 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్తోపాటు, ఇంక్రిమెంట్లు, లీవ్ పీరియడ్కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లిస్తేనే ఫైల్ కదులుతుందని తెగేసి చెప్పారు.
దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2లక్షల నగదుతో డీఈ చాంబర్కు వెళ్లాడు. అక్కడ మురళీధర్రెడ్డి.. లతీఫ్, దామోదర్లతో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, ఏసీబీ దాడిలో పట్టుబడ్డ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో మురళీధర్రెడ్డికి చెందిన ఇంట్లో, నల్లగొండలోని లతీఫ్, దామోదర్ ఇళ్లలో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.