పోలీసుల అదుపులో క్షుద్రపూజారి, మహిళ భర్త?
ABN , First Publish Date - 2022-02-23T05:53:19+05:30 IST
పోలీసుల అదుపులో క్షుద్రపూజారి, మహిళ భర్త?
దర్యాప్తు ముమ్మరం చేసిన మధిర పోలీసులు
మధిర, ఫిబ్రవరి 22: వివాహిత మహిళను క్షద్రపూజల పేరుతో లైంగికంగా వేధించిన క్షుద్రపూజల నిర్వాహకుడు, వివాహిత భర్త ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్ల్లు సమాచారం. ఖమ్మం జిల్లా మధిరలో క్షుద్రపూజల పేరుతో కృష్ణాజిల్లా వజినేపల్లికి చెందిన క్షుద్రపూజల నిర్వాహకుడు శ్రీనివాస్ గత ఐదురోజుల క్రితం మధిర వచ్చి పూజల పేరుతో వివాహితను లైంగికంగా వేధించిన విషయం విదితమే. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ‘అరిష్టం పోవాలంటే శారీరకంగా కలవాలి’, అనే శీర్షికన మంగళవారం ప్రధాన సంచికలో వార్తా కథనం రావడంతో పోలీస్ శాఖ స్పందించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మధిర టౌన్ ఎస్ సతీష్కుమార్ ఆఽధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఏపీలోని కృష్ణాజిల్లా వజినేపల్లి వెళ్లి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ మహిళను వేధించిన క్షుద్రపూజల నిర్వాహ కుడి ఆచూకి కనుగొని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే మహిళ భర్తను మధిరలోనే అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో క్షుద్రపూజల నిర్వాహకుడి ఆచూకీ తెలుసుకొని వజినేపల్లి వెళ్లి శ్రీనివాస్ను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇంకా ఈ గ్రూపులో ఎంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని ఈ విధంగా ట్రాప్లోకి దించారనే విషయాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆధారంగా అసలు నిర్వాహకులను పట్టుకొనే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.