గేదెను చంపిన పెద్దపులి
ABN , First Publish Date - 2022-02-23T05:52:43+05:30 IST
గేదెలగుంపు నుంచి తప్పిపోయి ఓ గేదెను పెద్దపులి చంపింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం దమ్మపేట మండలంలో వెలుగు చేసింది. ఫారెస్టు అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లివారిగూడెంలో ఘటన
ముల్కలపల్లి అటవీ ప్రాంతం నుంచి
వచ్చినట్లుగా భావిస్తున్న అటవీ అధికారులు
దమ్మపేట, ఫిబ్రవరి 22: గేదెలగుంపు నుంచి తప్పిపోయి ఓ గేదెను పెద్దపులి చంపింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం దమ్మపేట మండలంలో వెలుగు చేసింది. ఫారెస్టు అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మొండివర్రె గ్రామానికి చెందిన నల్లబోతుల రంగారావు గేదేలను సోమవారం సమీపంలోని తోటల్లోకి మేతకు తోలుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తోలుకు వస్తుండగా, ఓ గేదె దూడ కనిపించలేదు. అప్పటికే చీకటి పడుతుండటంతో ఇంటికి వచ్చేశాడు. కాగా మంగళవారం మధ్యాహ్నం నల్లివారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరులకు గేదె దూడ చనిపోయి ఉండటాన్ని గమనించారు. అక్కడ పెద్దపులి గుర్తులు కనపడటంతో, పులి చంపినట్లుగా బావించారు. స్ధానికుల ద్వారా దమ్మపేట అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి గుర్తులు సేకరించారు. పులి దాడిలో మృతి చెందినట్లుగా రేంజర్ శ్రీనివాసరావు గుర్తించారు. మొండివర్రె గ్రామానికి చెందిన రంగారావుకు చెందిన పశువుగా గుర్తించారు. సోమవారం సాయంత్రం ముల్కలపల్లి అటవీ ప్రాంతంలో పులి చూసినట్లుగా సమాచారం ఉందని ఆయన చెప్పారు. అటు నుంచి నాగుపల్లి అటవీప్రాంతానికి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం మేకను చంపితిన్న పులి మళ్లీ, వచ్చిందేమోనని ఈప్రాంత ప్రజలు ఆందోళ చెందుతున్నారు.