బంగారం బావిలో వేశాడని..

ABN , First Publish Date - 2022-04-05T06:11:48+05:30 IST

బంగారం బావిలో వేశాడని..

బంగారం బావిలో వేశాడని..
దొంగతో నీటిని తోడించిన బావి ఇదే

దొంగతోనే రోజంతా నీటిని తోడించిన ఇల్లెందు పోలీసులు

ఇల్లెందుటౌన, ఏప్రిల్‌ 4: తాను దొంగిలించిన బంగారాన్ని బావిలో వేశానని ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ దొంగతోనే రోజంతా బావినీటిని తోడించిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. ఇల్లెందుపట్టణంలోని నెం2బస్తీలో గోనె అర్వమ్మ అనే మహిళ ఇంట్లో అదే పట్టణం స్టేషన్‌బస్తీకి చెందిన ఓ వ్యక్తి కేవలం 10రోజులపాటు కిరాయికి ఉన్నాడు. ఇటీవల ఇల్లెందుపట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు ప్రతీ బస్తీలో గ్రూప్‌మీటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మైకుల ద్వారా విస్తృతప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఇదేక్రమంలో నెం2బస్తీలో కూడా పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం జరిగిన మరుసటిరోజే కిరాయికి అర్వమ్మ ఇంట్లో కిరాయికి ఉన్న ఆ వ్యక్తి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అయితే పోలీసలు తమ తనిఖీల్లో భాగంగా మూడు రోజుల క్రితం సదరు వ్యక్తిని అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో తాను దొంగతనాలు చేశానని, తాను దొంగిలించిన బంగారాన్ని అంతా నెం2బస్తీలో తాను కిరాయికి ఉన్న అర్వమ్మ ఇంటి అవరణలోని బావిలో పడేశానని చెప్పాడు. దీంతో ఆ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు.. సదరు నిందితుడిని సోమవారం ఉదయం ఆ బావి వద్దకు తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో గోప్యంగా బావిలో ఉన్న నీటిని అతడితోనే తోడించారు. కానీ రాత్రి 8గంటల సమయంలో ఈ విషయం బయటకు రావడంతో మీడియా ప్రతినిధులు సదరు ప్రాంతానికి వెళ్లగా.. పోలీసులు నీటిని తోడే పనిని నిలిపేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే బావిలో నీటిని పూర్తిగా తోడితేనే అసలు అందులో బంగారం ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుందని పోలీసులు పేర్కొన్నారు. రోజంతా గోప్యంగా సాగిన ఈ నీటి తోడివేత చివరకు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2022-04-05T06:11:48+05:30 IST