జాతీయభావం పెంపొందించే దిశగా

ABN , First Publish Date - 2022-11-25T00:05:44+05:30 IST

వివిధ కేసుల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా వచ్చే వారిలో జాతీ య భావం పెంపొందించే దిశగా భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జాతీయభావం పెంపొందించే దిశగా
సబ్‌జైల్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఐటీడీఏ పీవో (ఫైల్‌ఫొటో)

భద్రాచలం, నవంబరు 24 : వివిధ కేసుల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా వచ్చే వారిలో జాతీ య భావం పెంపొందించే దిశగా భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజు ఉదయం 7.20కి వందేమాతరం, ప్రతిజ్ఞ, సాయంత్రం 4.20కి జనగణమన ఆలపిస్తున్నారు. ఇందుకోసం జైలు ప్రాంగణంలో ప్రత్యేకంగా లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశా రు. ప్రతి రోజు ఇదే తీరున అండర్‌ ట్రయల్‌ ఖైదీలతో నిర్వహించే కార్యక్రమానికి ఆరు నెలల క్రితం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా భద్రాచలం ప్రత్యేక సబ్‌జైల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక సబ్‌జైలు అధికారి జె.ఉపేందర్‌ ప్రారంభించారు. దీని ద్వారా అందరిలో దేశభక్తి పెంపొందడంతో పాటు సమాజంలో అందరూ సోదరభావంతో జీవించాలనే భావ నను కల్పించేందుకు ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సబ్‌జైల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌, పూలమొక్కలు తదితర వాటితో సుందర నందనవనంలా తీర్చిదిద్దారు. ఇదే సమయంలో విద్యాదానం పథకంలో భాగంగా సంతకం చేయలేని వారికి సైతం వారి సంతకం నేర్చుకునేలా శిక్షణ ఇస్తున్నారు. లైబ్రరరీ ఏర్పాటు చేసి అం దులో స్ఫూర్తిని నింపే ఆఽధ్యాత్మిక పుస్తకాలను వారితో చదివిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్ట్‌ ఆప్‌ లివింగ్‌ వారి ఆధ్వర్యంలో సుదర్శన ప్రక్రియపై శిక్షణ ఇస్తున్నారు. కాగా ఇటీవల గాంధీ జయంతిని పురస్కరించుకొని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ ఆవిష్కరించారు. కాగా అధికారులు సైతం జైలు ప్రాంగణం నిర్వహణ తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ జైలు అధికారులను అభినందిస్తున్నారు.

Updated Date - 2022-11-25T00:05:45+05:30 IST