బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి
ABN , First Publish Date - 2022-10-12T04:44:55+05:30 IST
బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ గుంటుపల్లి భారతారాణి అన్నారు.
సీడబ్ల్యూసీ చైర్పర్సన్ గుంటుపల్లి భారతారాణి
ముదిగొండ, అక్టోబరు 11: బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ గుంటుపల్లి భారతారాణి అన్నారు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులు బాలికలు, మహిళలకు సానుకూలంగా లేవని, నిత్యం బాలికలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు, కిడ్నాప్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని అధిగమించి బాలికలు మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మదర్థెరిస్సా, దుర్గాబాయిదేశ్ముఖ్, సావిత్రిబాయిపూలే, కస్తూర్బా వంటి వారిని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. కార్యక్రమంలో 1098 జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏహెచ్టీయూ బాధ్యుడు నర్సింహారావు, ఎంపీటీసీ మాధవి, స్పెషలాఫీసర్ ఇందిర, అనూష, గురుమూర్తి, నరేందర్, మౌనిక పాల్గొన్నారు.