కొత్త తరహాలో సైబర్ మోసం
ABN , First Publish Date - 2022-12-06T23:39:17+05:30 IST
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులమని నమ్మించి ఓ ఫాస్ట్పుడ్ నిర్వాహకుడి వద్ద డబ్బులు కాజేశారు.
ముదిగొండ, డిసెంబరు 6: సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులమని నమ్మించి ఓ ఫాస్ట్పుడ్ నిర్వాహకుడి వద్ద డబ్బులు కాజేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద ఫాస్ట్పుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తనకు వీలు కాకపోవడంతో ఈనెల ఒకటి నుంచి ఫాస్ట్పుడ్ సెంటర్ నిర్వహణను ఆపివేశాడు. నాలుగురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నానని తెలపడంతో నాగరాజు విషయం ఏంటని అడిగాడు. మీది పలానా ఫాస్ట్పుడ్ సెంటర్ అని మీ సెంటర్లో సూర్యాపేటకు చెందిన కొందరు ఫాస్ట్పుడ్ పార్శిల్ తీసుకొని తినడంతో పుడ్ పాయిజన్ అయిందని వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడంతో ఇప్పటికే రూ.30వేలు ఖర్చయిందని తెలిపాడు. వారు పోలీస్స్టేషన్లో మీపై ఫిర్యాదు చేశారు, నేను వారితో మాట్లాడి సెటిల్ చేస్తానని లేకుంటే నీ ఇష్టమని బెదిరించడంతో దీంతో నాగరాజు తనవద్ద అంత డబ్బులు లేవని రూ. మూడు వేలు ఇస్తానని నాగరాజు తన బంధువు ద్వారా రూ.1, 400 ఫోన్పే చేయించి మిగతా రూ.1, 600 బ్యాంకు అకౌంట్ ద్వారా పంపించాడు. ఇదేదో బాగుందకున్న కేటుగాడు ముదిగొండలోని జ్యోతి ఫాస్ట్పుడ్ సెంటర్ నిర్వాహకుడైన యుగంధర్కు అదే నెంబర్ ద్వారా ఫోన్ చేసి మీది జ్యోతి ఫాస్ట్పుడ్ సెంటర్ కదా, మీసెంటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అడగగా లేవని చెప్పాడు. ఆతర్వాత మీ ఫాస్ట్పుడ్ సెంటర్లో సూర్యాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు భోజనం చేయడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నమ్మించారు. మీపై ఫిర్యాదు చేశారు. అందువల్ల మందులఖర్చుల కోసం నేను సెటిల్మెంట్ చేస్తానని లేకపోతే మీ ఇష్టమని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో కంగారుపడిన యజమాని యుగంధర్ పక్కవాళ్లకు తెలపడంతో ఈ విషయం కాస్తా పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు సైబర్నేరగాడిని పట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకూ ఈ నేరానికి పాల్పడిందని కానిస్టేబులా లేక సైబర్ నేరగాడా అనేది తెలియా ల్సి ఉంది. ఈ రెండు సంఘటనలు కాస్తా సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు.