Bhatti vikramarka: తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది
ABN , First Publish Date - 2022-09-01T19:47:19+05:30 IST
తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
ఖమ్మం: తెలుగు రాష్ట్రాల (Telugu states) మధ్య కేంద్రం గొడవలు పెడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti vikramarka)విమర్శలు గుప్పించారు. గురువారం ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. ఏపీ (Andhrapradesh)కి కరెంట్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం (Central government) ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుండి రావాల్సి రూ.లక్ష కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు... కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ (Telangana)కు బయ్యారం ఉక్కు కర్మాగారం, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్, ఐటీఐఆర్, ట్రైబల్ విశ్వ విద్యాలయం ఇవ్వాలని తెలిపారు. ఎనిమిదేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకోసం పనిచేస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.