సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడని కేసు

ABN , First Publish Date - 2022-02-19T06:36:02+05:30 IST

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడని కేసు

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడని కేసు
ఖమ్మంలోని నవీన్‌ చౌదరి ఇంట్లో విచారణ చేస్తున్న మైలవరం సీఐ శ్రీనివాస్‌ తదితరులు

తెలుగు యువత నాయకుడిపై ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే ఫిర్యాదు

నవీన్‌ చౌదరిని అరెస్టు చేసేందుకు ఖమ్మానికి ఏపీ పోలీసులు

ఖమ్మం క్రైం ఫిబ్రవరి 18: ఏపీలోని మైలవరం ఎమ్మెల్యేపై సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడనే ఫిర్యాదులపై తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నున్నా నవీన్‌ చౌదరిపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో మైలవరం సీఐ శ్రీనివాస్‌ సిబ్బందితో శుక్రవారం ఖమ్మం నగరంలోని నవీన్‌ ఇంటికి వచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై నవీన్‌ ఇటీవల ఓ పోస్టు పెట్టారు. సదరు పోస్టుపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను అరస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ఖమ్మం వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతడి ఆచూకీకోసం కుటుంబ సభ్యులను పోలీసులు ఒత్తిడి చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కమ్మ సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నోటీసులు ఇచ్చి వెళ్లాలని కోరగా పోలీసులు ఒప్పుకోలేదు. తమ సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేపై పోస్టు పెట్టినందుకు వ్యతిరేకంగానే నవీన్‌ ఆ పోస్ట్‌షేర్‌ చేశారని, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలను నాయకులను ఇలా టార్గెట్‌ చేయడం సరైనది కాదని కమ్మ సంఘం నాయకులు తెలిపారు. నవీన్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో అతడు వచ్చాక మైలవరం పోలీస్టేషన్‌కు రావాలని కుటుంబ సభ్యులకు తెలిపి అక్కడ నుంచి పోలీసులు వెళ్లిపోయారు. కేసు విచారణలో భాగంగానే ఖమ్మం వచ్చినట్లు మైలవరం సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2022-02-19T06:36:02+05:30 IST