హత్యా రాజకీయాలు చేసిన వారు బీజేపీని విమర్శిస్తున్నారు
ABN , First Publish Date - 2022-04-25T03:51:26+05:30 IST
ఖమ్మం జిల్లాలో అనేకమందిని బలిగొని హత్యా రాజకీయాలు చేసిన కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడం విడ్డూరంగా ఉందని, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీదర్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు తెలిసీతెలియక మాట్లాడుతున్నారు
ప్రజాతంత్ర లౌకిక వేదిక పేరుతో మంత్రి పువ్వాడకు భజన
సాయిగణేష్పై రౌడీషీటర్ ముద్ర వేయడం బాధాకరం
విలేకరుల సమాశంలో శ్రీధర్రెడ్డి, గల్లా సత్యనారాయణ ధ్వజం
ఖమ్మం బైపాస్రోడ్డు, ఏప్రిల్ 24: ఖమ్మం జిల్లాలో అనేకమందిని బలిగొని హత్యా రాజకీయాలు చేసిన కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడం విడ్డూరంగా ఉందని, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీదర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధర్మంకోసం, తాను నమ్మిన సిద్దాంతం కోసం సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటే అతడికి న్యాయం జరగకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. శనివారం నగరంలో కొంతమంది ప్రజాతంత్ర లౌకిక వేదిక పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని కానీ దానికి పువ్వాడ అజయ్ భజన బృందం సమ్మేళనం అనే పేరు పెట్టి ఉండే బాగుండేదన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, పూర్తి వివరాలు అధికారులను తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు. జిల్లాలో రహదారుల నిర్మాణానికి కేంద్రం ఎంత వాటా ఇచ్చిందో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడిగి తెలుసుకొవాలన్నారు. భద్రాద్రిని కారిడార్లో చేర్చి అభివృద్ధి చేయబోతున్నామని, భద్రాద్రికి రైలుమార్గం ఎర్పాటు చేసి పర్యాటకంగా అబివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ‘శనివారం కొంతమంది టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి హాజరైన వక్తలు సాయిగణేష్ను ఒక రౌడీషీటర్ అని, నేరగాడు అని విమర్శించారు. అలా మాట్లాడటం విడ్డురంగా ఉంది. దీని వెనుక ఎవరు ఉన్నా రో ప్రజలకు తెలుసని’ పేర్కొన్నారు. అందుకే సాయి గణేష్ ఆత్మహత్యపై తాము సీబీఐ విచారణ కోరు తున్నామన్నారు. మంత్రికి ఆ చిత్తశుద్ధి గనుక ఉంటే హుందాగా సీబీఐ విచారణను స్వయంగా కోరాలన్నారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నున్నా రవి, రుద్ర ప్రదీప్, శ్యామ్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు మందా సరస్వతి, విజయరాజు, గుత్తా వెంకయ్య, అనంతు ఉపేందర్ గౌడ్, సుధాకర్, రాజేష్ గుప్తా, అంజయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.