భద్రాచలంరోడ్‌-సత్తుపల్లి రైల్వేలైన ప్రారంభం నేడు

ABN , First Publish Date - 2022-11-12T00:53:35+05:30 IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓపెన కాస్ట్‌ బొగ్గు గనుల నుంచి బొగ్గును రవాణా చేసేందుకు వీలుగా నిర్మించిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైల్వేలైనను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు.

భద్రాచలంరోడ్‌-సత్తుపల్లి రైల్వేలైన ప్రారంభం నేడు
కొత్తగూడెం రైల్వేస్టేషన లో ఏర్పాట్లు చేస్తున్న రైల్వే అధికారులు

రామగుండం నుంచి రిమోట్‌ ద్వారా జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ

బొగ్గు రవాణాకు వీలుగా 54 కిలోమీటర్ల లైన నిర్మాణం

కార్యక్రమ నేపథ్యంలో కొత్తగూడెం స్టేషన ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు

సత్తుపల్లి /కొత్తగూడెం పోస్టాఫీ్‌ససెంటర్‌, నవంబరు 11: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓపెన కాస్ట్‌ బొగ్గు గనుల నుంచి బొగ్గును రవాణా చేసేందుకు వీలుగా నిర్మించిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైల్వేలైనను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన అక్కడి నుంచి వర్చువల్‌ రిమోట్‌ ద్వారా ప్రారంభించనున్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం సింగరేణి ఓపెనకా్‌స్ట బొగ్గు గనుల్లో ఉత్పత్తి అయిన బొగ్గును తరలించే లక్ష్యంతో భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి వరకు 54.10కిలోమీటర్ల పొడవునా రైల్వేలైన నిర్మాణం పూర్తి చేశారు. ఇందుకైన ఖర్చులో రూ.619కోట్లు సింగరేణి సంస్థ భరించగా మిగిలిన మొత్తాన్ని రైల్వే శాఖ మంజూరుచేసింది. దీని నిర్మాణంలో భాగంగా 860ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో 3స్టేషన్లు, 10మేజర్‌ బ్రిడ్జీలు, 37మైనర్‌ బ్రిడ్జీలు, 40ఆర్‌యూబీలు, 7ఆర్‌వోబీలు నిర్మించారు. రోజుకు 8ర్యాకుల బొగ్గును తరలించే లక్ష్యం పెట్టుకోగా.. ప్రస్తుతం అధికారులు ఆస్థాయిలో బొగ్గు రవాణాకు కృషి చేస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రోజుకు 1000లారీల ద్వారా జరిగే బొగ్గు రవాణా నిలిచిపోయింది. అయితే శనివారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ రైల్వేలైన్‌ ప్రారంభ కార్యక్రమం కోసం కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన ప్రాంగణంలో సౌతసెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌ జోన ఏడీఆర్‌ఎం రాథోడ్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలను ప్రజలు, ప్రయాణికులు చూసేందుకు వీలుగా స్టేషన్‌ ఆవరణలో మూడు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. అయితే కొత్తగూడెంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, భద్రాద్రి, ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌ రాజు, తదితరులను ఆహ్వానించామని రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు.

2010లో రైల్వేలైన మంజూరు

సింగరేణి సంస్థ ప్రతిపాదన మేరకు భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైల్వేలైనను కేంద్రప్రభుత్వం 2010లో మంజూరు చేసినా పదేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. దీంతో అంచనా వ్యయం కూడా మూడు రెట్లు పెరిగింది. వాస్తవంగా భద్రాచలం రోడ్‌ నుంచి ఏపీలోని కొవ్వూరుకు పదేళ్ల క్రితం రైల్వేలైన మంజూరు చేసినా సింగరేణి సంస్థ భాగస్వామ్యంతోనే సత్తుపల్లి వరకు ప్రధానంగా బొగ్గు రవాణా కోసమే రైల్వేలైన నిర్మించారు. సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వేలైనను కొవ్వూరు వరకు పొడిగించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-11-12T00:53:36+05:30 IST