ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-11-27T22:59:43+05:30 IST
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు కోరారు.
అశ్వారావుపేట టౌన్, నవంబరు 27: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు కోరారు. అశ్వారావుపేటలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. కేంద్రాల వద్ద ఇప్పటి వరకు ఏయే రకమైన దరఖాస్తులు వచ్చాయి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఓటుహక్కు కోసం దరఖాస్తుపై జరుగుతున్న ప్రచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బీఎల్వోలు, ఇతర సిబ్బంది అంతా అర్హత కలిగిన యువతులు ఓటు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు తమ బాధ్యతగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అందరూ ఓటుకు ఆధార్తో అనుసంధానం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 83శాతం ఆధార్ను అనుసంధానం చేసుకున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఇది 90శాతంకుపైగానే ఉందన్నారు. అందరూ ఓటుకు ఆధార్ను అనుసంధానం చేయాలన్నారు. కొత్తగా ఓటుహక్కు కోసంతో పాటు మార్పులు చేర్పులకు, తొలిగింపులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు తిరిగి డిసెంబర్ 3,4 తేదీల్లోనూ నిర్వహించటం జరుగుతుందన్నారు. నూతన ఓటర్ల జాబితాను జనవరిలో విడుదల చేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్ల నమోదుతో పాటు ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు చల్లా ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.