అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-03-06T04:41:19+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బడ్జెట్లో నిధులు కేటాయించాలి
తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
ఖమ్మం కలెక్టరేట్, మార్చి5: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం, కూరపాటి వెంకటేశ్వర్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం యర్రాశ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ఎం హుస్సేన్ మాచర్ల భారతి బండి పద్మ సిద్దినేని కరుణకుమార్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజల నుంచి రూ 7వేల కోట్లు డిపాజిట్లు సేకరించిందన్నారు. తిరిగి చెల్లించకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రిగోల్డ్ ఆస్థులను జప్తు చేసి బాధితులకు డబ్బులు చెల్లిస్తామని ప్రకటించాయని అన్నారు. ఏపీలో ప్రభుత్వమే డబ్బులను చెల్లిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆదుకోలేదని ఆరోపించారు. తక్షణమే అగ్రిగోల్డ్ సంస్థలను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, ప్రధాన కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు, కోశాధికారి మద్దినేని రామారావు, నల్లబోలు సునీత, ఏజెంట్లు పాల్గొన్నారు.